ఈ యేడాది ఆఖరులో అంటే డిసెంబరు నుంచి తితిదే ఆధ్వర్యంలో 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశ పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	టీటీడీ పరిపాలనా భవనంలోని తన చాంబర్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఆయుష్ శాఖ నుంచి పంచగవ్య ఉత్పత్తులకు లైసెన్సులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
 
									
										
								
																	
	 
	ముడి పదార్థాల సేకరణ, యంత్రాలను సిద్ధం చేసుకుని యంత్రాల ఏర్పాటుకు అవసరమయ్యే విద్యుత్, ఇంజినీరింగ్ పనులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కోయంబత్తూర్కు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు, సదరు సంస్థ 10 సంవత్సరాల పాటు ఆయుర్వేద ఉత్పత్తులు తయారుచేసి టీటీడీకి అందజేస్తుందని ఆయన వివరించారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	తితిదే మార్కెట్లోకి విడుదల చేసే ఉత్పత్తుల్లో ఫ్లోర్ క్లీనర్, సోపులు, షాంపూ, దంత మంజనం పౌడర్, ఆయుర్వేద అగరబత్తులు లాంటివి ఉంటాయని తెలిపారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీ నుంచి 70 రకాల గో ఆధారిత ఉత్పత్తుల తయారీకి సంబంధించి ఆయుష్ వద్ద లైసెన్సులు పొందే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కూడా ఆయన కోరారు.