Publish Date: Mon, 15 Nov 2021 (21:54 IST)
Updated Date: Mon, 15 Nov 2021 (21:59 IST)
చిన్నారులు, విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (ఎస్ఈఐఎఫ్) చైర్మన్ డాక్టర్ శామ్యూల్ రెడ్డి పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని కస్పా హైస్కూల్లో SEED (Spandana Education & Encouragement Deed) కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రపంచంలో ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతున్నాయని వీటి ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా ఉంటోందని ఆయన అన్నారు. విద్యార్థుల్లో జీవితం పట్ల ఆశావహ దృక్పథం, సానుకూల ఆలోచనలు పెంపొందించేందుకు, జీవితంలో వారు ఎదిగేందుకు అవసరమైన జ్ఞానాన్ని అందించాలనే ఆశయంతో సీడ్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.
సీడ్ కార్యక్రమం ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 పాఠశాలల్లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు శామ్యూల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీకే రాజు మాట్లాడుతూ విద్యార్థుల కోసం స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించి, విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుండటం అభినందనీయమని అన్నారు.
కార్యక్రమాలను మొదలుపెట్టడం ఒక ఎత్తయితే అకుంఠిత దీక్షతో ముందుకు తీసుకెళ్లడం అంతకంటే ముఖ్యమని.. ఈ దిశగా ఎస్ఈఐఎఫ్ చేస్తున్న కార్యక్రమాలు సమాజంలో తప్పకుండా సానుకూల దృక్ఫధాన్ని పెంపొందించజేస్తున్నాయన్నారు.
తమ కుటుంబం పడిన ఆవేదన మరో కుటుంబానికి ఎదురుకావొద్దనే సత్సంకల్పంతో శామ్యూల్ రెడ్డి గారు ఫౌండేషన్ స్థాపించి ఇలాంటి కార్యక్రమాల నిర్వహించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం అని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్రావు మాట్లాడుతూ ఇలాంటి చారిత్రక కార్యక్రమం తమ స్కూల్లో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.