Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రా - తెలంగాణాల మధ్య ముదురుతున్న జల వివాదం

Advertiesment
Telangana
, బుధవారం, 30 జూన్ 2021 (11:22 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం నానాటికీ ముదిరిపోతోంది. నిన్నామొన్నటివరకు నీటి వాటాలపై నెలకొన్న వివాదం కాస్తా ఇప్పుడు ఈ జల వివాద పంచాయతీ కాస్త కీలక మలుపు తిరిగింది. అనుమతి లేకుండా జరుగుతోన్న విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు వరుసగా మూడోసారి లేఖ రాసింది.
 
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని నీటిని వినియోగిస్తోందంటూ ఏపీ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
జూన్ 1 తేదీ నుంచే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం కేటాయింపుతో సంబంధం లేకుండానే నీటిని వినియోగించుకుంటోందని కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు సుమారు 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని పేర్కొంటూ కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యకార్యదర్శికి ఏపీ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు. 
 
ఇప్పటికే ఈ అంశంపై రెండుసార్లు లేఖ రాసినా.. కేఆర్ఎంబీ పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, ఎగువ నుంచి 17.36 టీఎంసీల మేర నీటి ప్రవాహాలు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంటే.. అందులో 40 శాతం నీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని లేఖలో పేర్కొన్నారు. 
 
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా నీటిని వినియోగించటం సరికాదన్నారు. తదుపరి నీటి వినియోగాన్ని నిలుపుదల చేసేలా తెలంగాణ అధికారులను నిలువరించాలంటూ ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. 
 
అంతకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు లేఖ రాసింది. దీన్ని తక్షణం పరిగణనలోకి తీసుకున్న కృష్ణా బోర్డు.. తక్షణం ఆ ప్రాజెక్టు పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా టీకా కోసం వెళితే ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు...