నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పేపర్ 1 ఫలితాలను అధికారికంగా తన అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో ప్రకటించింది. ముఖ్యంగా, ఈ పరీక్షలో 24 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ స్కోరు సాధించారు. అత్యధిక సంఖ్యలో టాపర్లు రాజస్థాన్ నుండి వచ్చారు. తరువాత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుండి వచ్చారు.
జేఈఈ (మెయిన్)లో నకిలీ పత్రాలు సహా అన్యాయమైన మార్గాలను ఉపయోగించిన 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది. కీలకమైన రెండవ ఎడిషన్ పరీక్షకు 9.92 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ 1 పరీక్షలను నిర్వహించారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 24మంది వంద పర్సంటైల్ స్కోర్ సాధించగా.. అందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వున్నారు.
హైదరాబాదుకు చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సాధించారు. బనిబ్రత మాజీ, వంగల అజయ్ రెడ్డి 300కి 300 మార్కులు రావడంతో వారిద్దరికీ ఎన్టీఏ ఒకే ర్యాంక్ కేటాయించింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో అజయ్రెడ్డి ప్రథమ ర్యాంకు సాధించారు. అతడి సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తాటిపాడు కాగా 9వ తరగతి నుంచి హైదరాబాద్లోనే వుంటూ చదువుకుంటున్నాడు.
జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించేందుకు 93.10 శాతం పర్సంటైల్ అవసరం కాగా.. అందులో ఓబీసీ అభ్యర్థులకు 79.43, ఎస్సీలకు 61.15 కటాఫ్, ఎస్టీలకు 47.90 ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 80.38 కట్ ఆఫ్ మార్కులుగా నిర్ణయించారు.