Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా విశ్వరూపం - 14 నుంచి బెంగుళూరులో లాక్డౌన్

Advertiesment
Bangalore
, ఆదివారం, 12 జులై 2020 (13:57 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇలా వ్యాపిస్తున్న నగరాల్లో బెంగుళూరు ఒకటి. ఈ నగరంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నిజానికి తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. 
 
ముఖ్యంగా బెంగళూరులో ప్రతి రోజు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. మహమ్మారి కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఈ నెల 14వ తేదీ నుంచి 23 వరకు బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 14వ తేదీ రాత్రి 8 గంటలకు లాక్డౌన్ మొదలవుతుందని... 23వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. 
 
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, లాక్డౌన్ రోజుల్లో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని తెలిపింది. లాక్డౌన్ సమయంలో ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరించింది. 
 
దేశంలో కరోనా స్వైర విహారం 
దేశంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. ఫలితంగా గడచిన 24 గంటల్లో అంటే ఒక్క రోజులోనే ఏకంగా 28637 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 551 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,49,553కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 22,674కి పెరిగింది. 2,92,258 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,34,621 మంది కోలుకుని, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
కాగా, శనివారం వరకు దేశంలో మొత్తం 1,15,87,153 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శనివారం ఒక్కరోజులో 2,80,151 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. 
 
తెలంగాణాలో మరో 1500 కేసులు 
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తోంది. కొత్తగా 1,178 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 33,402కి చేరింది. గడచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 736 కేసులు గుర్తించారు. 
 
రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 101 కేసులు వచ్చాయి. తాజాగా మరో 9 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 348కి పెరిగింది. ఇవాళ 1,714 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 12,135 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఏపీలో మరణ మృదంగం 
ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా, కరోనా మరణాల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఒక్కరోజులో 17 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 309 దాటింది.
 
ఇక, కొత్తగా 1,813 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 311 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 300, కర్నూలు జిల్లాలో 229, శ్రీకాకుళం జిల్లాలో 204 కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 1,168 మందిని డిశ్చార్జి చేశారు. దాంతో ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,393కి పెరిగింది. ఓవరాల్ గా 27,235 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇంకా 12,533 మంది చికిత్స పొందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా దెబ్బకు భయపడిన డోనాల్డ్ ట్రంప్.. తొలిసారి మాస్క్ ధరించిన ప్రెసిడెంట్