Publish Date: Wed, 12 May 2021 (20:25 IST)
Updated Date: Wed, 12 May 2021 (20:27 IST)
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అకాల మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో అపమృత్యు నివారణ కోసం హైదరాబాద్ కు చెందిన "వేదహిత" పౌండేషన్ సంస్థ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
కృష్ణ యజుర్వేదంలోని నారాయణ ఉపనిషత్తు నుండి అపమృత్యు దోషాన్ని తొలగించే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని 10 మంది వేదపండితులతో కలిసి నిర్విరామంగా జపం చేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వేదహిత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మన్యురింద్ర శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ వేద పండితులతో సంప్రదించి ఈ మంత్రాన్ని జపించాలని తీర్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దేవాలయాలలోని అర్చకులు కొందరు అకాల మరణాలకు గురవుతున్న కారణంగా ఈ మృత్యుంజయ జపాన్ని నిర్వహించాలని భావించినట్లు ఆయన వెల్లడించారు.
భవిష్యత్తులో అపమృత్యు గండం నుంచి ప్రజలు బయటపడాలి అన్న ఉద్దేశంతో ఈ జపాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మే 14వ తేదీన జూమ్ యాప్ ద్వారా ప్రసారం చేయనున్నట్లు మన్యురింద్ర శర్మ తెలిపారు.