తన భర్త, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ రిటైర్మెంట్పై భార్య అనుష్క శర్మ స్పందించారు. నువ్వు అద్భుతమైన వీడ్కోలును పొందావు అంటూ భావోద్వేగమైన పోస్ట్ చేశారు. ఈ మేరకు ఇన్స్టాలో ఓ స్టోరీ రాసుకొచ్చారు.
"అందరూ నీ రికార్డులు, మైలురాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. కానీ నువ్వు ఎపుడూ ఎవరికీ చూపించని కన్నీళ్లు, ఎవరూ చూడని పోరాటాలు, ఈ ఫార్మెట్పై నువ్వు చూపిన అచంచలమైన ప్రేమ నాకు గుర్తుండిపోతాయి. ప్రతి టెస్ట్ సిరీస్ తర్వాత నువ్వు కొంచెం వివేకవంతుడిగా, కొంచెం వినయంగా తిరిగి వచ్చావు. ఈ ఫార్మెట్లో నువ్వు అభివృద్ధి చెందడాన్ని చూడటం చాలా ప్రత్యేకం. ఏదో ఒక రోజు నువ్వు వైట్ డ్రెస్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతావని ఊహించా. కానీ నువ్వు ఎల్లపుడూ నీ హృదయాన్ని అనురించావు. అందుకే నా ప్రేమను చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అద్భుతమైన వీడ్కోలును పొందావు" అని అనుష్క శర్మ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు.
టెస్ట్ కెరీర్కు స్వస్తి పలికిన విరాట్ కోహ్లీ!!
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ స్వస్తి పలుకుతున్నట్టు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన ఇన్స్టాఖాతాలో ఓ భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. గత 14 యేళ్ళుగా టెస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ... టెస్ట్ క్రికెట్ కెరీర్కు గుడ్బై చెపుతున్నట్టు ప్రకటించారు. దశాబ్ద కాలానికిపైగా టెస్ట్ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణమని అన్నారు.
2011లో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టుల్లో అరంగేట్రం చేశారు. తన కెరీర్లో కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్లు ఆడి 30 సెంచరీలు, 31 అర్థ సెంచరీలతో మొత్తంగా 9,230 పరుగులు చేశాడు. 2025 జనవరి మూడో తేదీన ఆస్ట్రేలియా జట్టుతో కోహ్లీ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కాగా, ఇటీవలే రోహిత్ శర్మ కూడా టెస్ట్ కెరీర్కు స్వస్తి చెప్పిన విషయం తెల్సిందే. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.