బైకు కోసం కన్నతండ్రినే కడతేర్చాలని ఓ కసాయి కొడుకు యత్నించాడు. బైక్ కొనివ్వలేదనే కోపంతో తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు. నిద్రపోతున్న తండ్రిని గొడ్డలితో నరికాడు. అడ్డొచ్చిన తల్లిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ అమానుష ఘటన ఖమ్మం జిల్లాలోని మంగళగూడెంలో ఈ నెల 14వ చోటుచేసుకుంది. ఈ దాడిలో తండ్రి తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మంగళగూడేనికి చెందిన బండారు నాగయ్య, నాగలక్ష్మి అనే దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగయ్య కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చదువు మధ్యలోనే ఆపేసిన కొడుకు సతీష్ (22) జులాయిగా తిరుగుతుండేవాడు. ఇటీవల తనకు మొబైల్ ఫోన్ కావాలని గొడవ చేయగా తండ్రి నాగయ్య అప్పు చేసి మొబైల్ ఫోన్ చేసి కొనిచ్చాడు.
ఆ తర్వాత గత రెండు నెలలుగా గొడవ చేస్తుండగా, బైక్ కొనేంత డబ్బు తన వద్ద లేని సర్దిచెప్పినా వినిపించుకోలేదు. ఏదైనా పని చేసి బైక్ కొనుక్కోమని చెప్పగా తమపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడని తల్లి బోరున విలపిస్తూ చెప్పింది. ఈ నెల 13వ తేదీ లోగా బైక్ కొనివ్వకపోతే తమను చంపేస్తారని కొడుకు బెదిరించాడని నాగలక్ష్మి మీడియాకు వివరించారు.
ఈ క్రమంలోనే 14వ తేదీన తెల్లవారుజామున తండ్రి నాగయ్యపై సతీశ్ గొడ్డలితో దాడి చేశాడని, అడ్డుకోవడానికి వెళ్ళిన తలపైనా దాడికి ప్రయత్నించాడని చెప్పారు. దీంతో తాను భయంతో అరుస్తూ బయటకు పరుగులు తీసినట్టు తెలిపారు. తన కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చేసరికి కొడుకు పారిపోయాడని చెప్పారు. గొడ్డలి వేటుతో గాయపడిన తన భర్త నాగయ్యను ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నాలక్ష్మి తెలిపారు.