అగ్రదేశం అమెరికా విర్రవీగుతూ ఇపుడు భారత్తో పెట్టుకుందని, దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది అమెరికానే అని ఆ దేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ హెచ్చరించారు. భారత్ విషయంలో అమెరికా ప్రపంచానికే పెద్దన్నలా వ్యవహరిస్తోందని, ఇది అమెరికాకే అపార నష్టం చేకూర్చనుందని అభిప్రాయపడ్డారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా విధించిన భారీ సుంకాలను వోల్ఫ్ తీవ్రంగా తప్పబట్టారు. అమెరికా తీరు ఒక ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టుగా ఉంది అని అన్నారు. ఇక్కడ ఎలుక ఎవరో, ఏనుగు ఎవరో మీరే అర్థం చేసుకోవాలన్నారు.
రష్యా నుంచి భారత్ భారీ మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్కు చెందిన పలు ఉత్పత్తులపై సుంకాలను 50 శాతానికి పెంచారు. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఆర్థికంగా నష్టం కలిగించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు.
దీనిపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, అమెరికా చర్యల వల్ల భారత్కు ఎలాంటి నష్టం వాటిల్లబోదన్నారు. అమెరికా మార్కెట్ మూసుకునిపోతే భారత్ తన ఉత్పత్తులను బ్రిక్స్ దేశాలకు అమ్ముకుంటుంది. గతంలో రష్యా తన ఇంధనాన్ని ఇతర దేశాలకు అమ్ముకున్నట్లే భారత్ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ప్రపంచ ఉత్పత్తిలో బ్రిక్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యూఏఈ వంటి దేశాల వాటా 35 శాతానికి చేరిందని, అదేసమయంలో జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా దేశాల వాటా 28 శాతానికి పడిపోయిందని ఆయన గుర్తు చేశారు.,ఇది ఒక చారిత్రక ఘట్టం. పశ్చిమ దేశాలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కూటమిని అమెరికాయో దగ్గరుండి పెంచి పోషిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు.