Publish Date: Fri, 21 Feb 2020 (12:55 IST)
Updated Date: Fri, 21 Feb 2020 (13:01 IST)
శివలింగాలు ఐదు రకాలని శివ మహా పురాణం చెప్తోంది. అందులో మొదటిది స్వయం భూలింగము, రెండోది బిందులింగం, మూడోది ప్రతిష్టిత లింగం, నాల్గోది చర లింగము, ఐదోది గురులింగమని పురాణాలు చెప్తున్నాయి. కాగా మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వయంభు లింగాన్ని పూజించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుంది. తనంతట తానుగా ప్రకటితమైన లింగానికి స్వయంభులింగమని పేరు.
దేవతలచే, ఋషులచే ఆత్మసిద్ధి కొరకు మంత్రపూర్వకముగా పవిత్రమైన భూమిపై స్థాపించబడిన, ప్రతిష్టించబడిన లింగానికి పౌరష లింగమని, ప్రతిష్ఠిత లింగమని పేరు. ఈ లింగమును పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
నాభి, జిహ్వా, నాసికాగ్రము, శిఖా అను క్రమములో కటి, హృదయము, శిరస్సు అను మూడు స్థానములలో భావన చేయబడిన లింగము ఆధ్యాత్మిక లింగంమనియు, చర లింగమనియు చెప్పబడును. చర లింగములలో రసలింగము శ్రేష్ఠమని చెప్పబడినది. రసలింగ పూజతో కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే మంగళకరమైన బాణలింగాన్ని పూజించడం రాజులకు మేలు జరుగుతాయి.
బంగారు లింగాన్ని పూజించడం ద్వారా వైశ్యులకు మంగళదాయకం. మంగళకరమగు రాతి లింగము శూద్రులకు గొప్ప పవిత్రత కల్గించును. స్ఫటికముతో చేసిన బాణలింగము కోరిన వరాలను ఇస్తుంది. ముత్తైదువులు అంటే మట్టితో చేసిన లింగాన్ని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. అందుకే రామేశ్వరంలోని సీతమాత ప్రతిష్ఠించిన లింగానికి ప్రాశస్త్యం కలిగివుంది. ఇంకా రామేశ్వరంలో పుణ్యతీర్థంగా, పుణ్యక్షేత్రంగా మారింది.