కాశ్మీర్ లోయలోని పహల్గామ్లో నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చే వారికి కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీహార్ రాష్ట్రంలోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పహల్గామ్ ఉగ్ర దాడిని ప్రస్తావించారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరులు భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.
ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంది. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడుని కోల్పోయింది. ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ తమలోని బాధను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసం అని మోడీ వ్యాఖ్యానించారు.
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నవారు, కుట్రలో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష విధిస్తాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, ట్రాక్ చేసి శిక్షిస్తామని యావత్ భారతీయులకు హామీ ఇస్తున్నా. బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉంది. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఉగ్రమూకల వెన్నెముకలను 140 కోట్ల మంది విరిచేస్తాం" అని ప్రధాని మోడీ హెచ్చరించారు.