కన్నబిడ్డల కోసం ఏదైనా చేసే తల్లుల కథలు వినే వుంటాం. అయితే కన్నబిడ్డపై కర్కశంగా ప్రవర్తించిన తల్లి కథే ఇది. కన్నకొడుకు చికెన్ కావాలని అడిగినందుకు ఓ తల్లి కన్నబిడ్డలపై కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో ఆ బాలుడిని ఎడాపెడా కొట్టింది. దెబ్బలు తాళలేక ఆ బాలుడు హాస్పిటల్ పాలైయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చిన్మయ్ ధుమ్డే అనే బాలుడు తన తల్లి పల్లవి ధుమ్డేతో చికెన్ తినాలని ఉందని మారం చేశాడు. ఇప్పుడు కుదరదని చెప్పినా ఆ బాలుడు పట్టించుకోలేదు. ఆగ్రహించిన ఆమె కొడుకు, కూతుర్ని రొట్టెల కర్రతో బాగా కొట్టింది. తల్లి కొట్టిన దెబ్బలకు తాళలేక ఆసుపత్రిలో ఇద్దరూ చికిత్స పొందారు. చికిత్స పొందుతూ కొడుకు మరణించాడు.
అరుపులు విన్న పొరుగువారు పోలీసులకు సమాచారం అందించగా, స్థానిక పోలీసులు, స్థానిక క్రైమ్ బ్రాంచ్, సబ్-డివిజనల్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నిందితురాలు మహిళను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.