Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా మంగళవారం తిరుమల వసంత మండపంలో శ్రీ ధాత్రివిష్ణు పూజ ఘనంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగింది. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ ధాత్రి (ఉసిరికాయ) వృక్షాన్ని వసంత మండపానికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ ధాత్రి అంటే లక్ష్మీ నారాయణుల రూపమన్నారు.
కార్తీక మాసంలో ధాత్రిని పూజించడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుందని, తద్వారా సంవత్సర కాలం సర్వదోషాలు తొలగి, నిత్యం గంగా స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుందని తెలిపారు. ఉసిరి చెట్టు కింద ఒక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుందన్నారు. అదేవిధంగా ఉసిరి, తులసీ రెండు కలిపిన జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే జన్మ జన్మల పాపం నశిస్తుందని, మనోవాంఛలు నెరవేరుతాయని వివరించారు.
ముందుగా ఘంటా నాదంతో సకల దేవతలను ఆహ్వానించి, కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి, అష్టదిక్పాలకులు, నవగ్రహాల అనుగ్రహంతో లోక క్షేమం కొరకు ప్రార్థన చేశారు. ఆ తరువాత ధాత్రి వృక్షానికి పూజ, నివేదన, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ ఎన్.ఎకె. సుందరవరదచార్యులు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.