Publish Date: Fri, 31 Jul 2026 (12:37 IST)
Updated Date: Fri, 31 Jul 2026 (12:41 IST)
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం, ఛాతీ నొప్పితో యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 51 సంవత్సరాలు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లాలోని నర్సంపేట శాసనసభ నియోజకవర్గం మాజీశాసన సభ్యుడిగా సేవలు అందించారు.
ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు. తొలుత యూత్ క్లబ్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2001లో కేసీఆర్ తెరాసను స్థాపించిన సమయంలో పార్టీలో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఎనిమిదేళ్లు పనిచేసారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మహాగర్జన సభల నిర్వహణలో సుదర్శన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా ఆయన తొలిసారి 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి 17 వేల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.