Publish Date: Thu, 25 Jun 2026 (18:13 IST)
Updated Date: Thu, 25 Jun 2026 (18:19 IST)
షాపుల్లో అమ్మే ఊరగాయలను లొట్టలేసుకుని తింటున్నారా? అయితే ఈ వార్త చదివితే.. ఇంట్లోనే ఊరగాయలు తయారు చేసి కమ్మగా తింటారు. అవును నిజమే.. వరంగల్లోని కాశీబుగ్గ, సాయి వీధిలో అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నడుస్తున్న అక్రమ ఊరగాయ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
తనిఖీల సమయంలో, కల్తీ ఊరగాయల తయారీకి ముడి సరుకులుగా పాడైపోయిన టమోటాలు, మామిడికాయలు, నిమ్మకాయలు, ఉసిరికాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తయారైన ఊరగాయలను చిన్న ప్యాకెట్లుగా ప్యాక్ చేసి స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి అరికెళ్ల శ్రీనివాస్ (51) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేంద్రం నుండి సుమారు రూ.2.25 లక్షల విలువైన కల్తీ సరుకును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.