Publish Date: Thu, 28 Oct 2021 (13:40 IST)
Updated Date: Thu, 28 Oct 2021 (13:43 IST)
వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మరదలు బయలుదేరారంటూ కామెంట్స్ చేశారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. షర్మిలనుద్దేశించి మంగళవారం మరదలు బయల్దేరిందంటూ కామెంట్ చేశారు.
'రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ దీక్షలు చేయడానికి మంగళవారం మరదలు ఒకామె బయల్దేరింది' అంటూ వ్యాఖ్యానించారు. ఆమె డిమాండ్ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలనూ ఆమె కొనసాగిస్తున్నారు.