Publish Date: Sat, 28 Mar 2020 (09:06 IST)
Updated Date: Sat, 28 Mar 2020 (09:08 IST)
కర్ణాటకలోని బీదర్ నుంచి కేంద్ర పారామిలటరీ, ఇతర బలగాలు శనివారం హైదరాబాద్ చేరుకున్నాయి. దాదాపు 80 వాహనాలలో ఈ బలగాలు జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, క్రాస్రోడ్, పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుమీదగా హైదరాబాద్ చేరుకున్నాయి.
కేంద్రం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ బలగాలు రాష్ట్రానికి వచ్చాయి. అయితే, కేంద్ర బలగాలు కావాలని తాము కేంద్రాన్ని కోరలేదని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. సాధారణ ప్రక్రియలో భాగంగా వారు ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
అయితే పరిస్థితి ని బట్టి కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపుతామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర పక్కనే వున్న తెలంగాణ లో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు తరలిరావడం గమనార్హం.
వసతిగృహాలను తెరిచే ఉంచుతాం: నిర్వాహకులు
కరోనా వైరస్ భయంతో కొంతమంది వసతిగృహా నిర్వాహకులు వెనకడుగు వేస్తున్నారు. వసతిగృహాలను మూసేయటం వల్ల అందులో ఉండే ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా విద్యార్థులందరూ ఊళ్లకు వెళ్లడానికి అనుమతి పత్రాలు ఇవ్వాలంటూ ఠాణాల ఎదుట బారులు తీరారు.
మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి జోక్యం చేసుకొని వసతిగృహాలను ఎట్టి పరిస్థితుల్లో మూసేయొద్దని ఆదేశాలు జారీ చేయటం వల్ల సమస్య సద్దుమణిగింది. హైదరాబాద్ మహానగరంలో విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాల నుంచి యువకులు, విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు వసతిగృహాల్లో ఉంటున్నారు.
కరోనా వైరస్ కారణంగా అన్ని పరిశ్రమలు, సంస్థలు సెలవులు ప్రకటించాయి. ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించాయి. ఉద్యోగాలు, ఉన్నత చదువుల్లో శిక్షణ కోసం కూడా వేల సంఖ్యలో యువత నగరంలో ఉంటున్నారు. రోజురోజుకు విస్తరిస్తున్న తరుణంలో వసతిగృహా నిర్వాహకులు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ తరుణంలో వసతిగృహాలు ఖాళీ చేయిస్తున్నమనటంలో ఎలాంటి వాస్తవం లేదని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ వసతి గృహాలు తెరిచే ఉంచుతామని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉద్యోగుల తల్లిదండ్రులు ఆందోళన చెందాలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.