Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగిసిన నాయిని అంత్యక్రియలు.. పాడె మోసిన మంత్రులు కేటీఆర్ - శ్రీనివాస్

Advertiesment
Nayani Narasimha Reddy
, గురువారం, 22 అక్టోబరు 2020 (16:18 IST)
అనారోగ్యం కారణంగా మరణించిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఆ రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో ముగిశాయి. ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో నాయిని అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపి నివాళుల‌ర్పించారు. నాయినిని క‌డ‌సారి చూసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. నాయిని అంత్య‌క్రియ‌ల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. 
 
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని.. బుధవారం అర్థరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడిన ఆయన బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్‌ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. వారంరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కుటుంబసభ్యులు అపోలో దవాఖానకు తరలించారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. 
 
నాయిని న‌ర్సింహారెడ్డి స‌తీమ‌ణి గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. భ‌ర్త‌ను క‌డ‌సారి చూసేందుకు ఆమె వీల్‌చైర్‌లోనే మ‌హాప్ర‌స్థానానికి చేరుకుని శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. భ‌ర్త‌ను త‌లుచుకుంటూ ఆమె క‌న్నీరుమున్నీరు అయ్యారు. నాయిని అంత్య‌క్రియ‌ల్లో భాగంగా ఆయ‌న‌ పాడెను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ మోశారు. ఆ త‌ర్వాత ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు నాయిని పాడె మోసి నివాళుల‌ర్పించారు. 
 
కాగా, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, నాయిని పాడె మోసి రుణానుబంధాన్ని తీర్చుకున్నారు. నాయినితో సన్నిహితంగా మెలిగిన వారు భావోద్వేగానికి గురుయ్యారు. నాయిని కార్మిక నాయకుడిగా రాజకీయ నేతగా ఆయన చేసిన పోరాటం చరిత్రలో మిగిలిపోతుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం గొప్పది. ముఖ్యంగా తెరాసతో ఆయనకున్న అనుబంధంగా చిరస్మరణనీయం. నాయిని మరణవార్త విన్న సీఎం కేసీఆరే కంటతడి పెట్టారంటే టీఆర్‌ఎస్‌లో ఆయన పాత్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. యస్ బ్యాంక్ అదిరే ఆఫర్స్