Publish Date: Fri, 10 Jul 2026 (18:25 IST)
Updated Date: Sat, 11 Jul 2026 (14:15 IST)
నానితో పిల్ల జమిందార్, ఆదిసాయికుమార్ తో సుకుమారుడు, అనుష్క తో భాగమతి చిత్రాలు తీసిన దర్శకుడు ఇప్పుడు ఓ కేసును ఎదుక్కొంటున్నట్లు ఫిలిం నగర్ కథనాలు చెబుతున్నాయి. ఔత్సాహిక కళాకారుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని హామీ ఇచ్చి, అతని తల్లిదండ్రుల నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది.
హామీ ఇచ్చినప్పటికీ యువకుడిని హీరోగా పరిచయం చేయకపోవడంతో పాటు తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ బాధిత యువకుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు చేసి, నిర్మాత విజయలక్ష్మి, దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబులను విచారిస్తున్నారని సమాచారం.
భాగమతి తర్వాత తెలుగు సినిమాకు దూరంగా వున్న అశోక్ దక్షిణాది భాషల్లో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన నాట్యకారుడు కూడా. అంతే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం బాగా మాట్లాడగలడు. హిందీ, అరబ్బీ, జర్మన్, రష్యన్ భాషలు కూడా నేర్చుకున్నాడు.