Publish Date: Thu, 21 Jul 2022 (10:21 IST)
Updated Date: Thu, 21 Jul 2022 (10:22 IST)
దేశ రాజధాని ఢిల్లీ నుంచి గౌహతికి బయలుదేరిన గో ఫస్ట్ ఏ320 నియో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం విండ్షీల్డుకు (ముందు భాగం) పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన పైలెట్లు తక్షణం అప్రమత్తమై విమానాన్ని జైపుర్కు దారి మళ్లించారు.
తొలుత ఈ విమానాన్ని ఢిల్లీకి వెనక్కి తీసుకెళ్లాలని భావించారు. కానీ, భారీవర్షం కురుస్తున్న కారణంగా సాధ్యపడలేదు. బుధవారం మధ్యాహ్నం తలెత్తిన ఈ సాంకేతిక లోపం గో ఫస్ట్ విమాన సర్వీసుల్లో గత రెండు రోజుల్లో మూడో ఘటనగా పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు.
ప్రయాణికులను జైపూర్ నుంచి మరో విమానంలో గౌహతికి పంపామని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా చూసినట్లు గో ఫస్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. దేశంలోని వివిధ విమాన సర్వీసుల్లో గత నెల రోజుల్లో సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలు పెద్దసంఖ్యలో నమోదుకావడం గమనార్హం.