Publish Date: Tue, 21 Jul 2020 (18:23 IST)
Updated Date: Tue, 21 Jul 2020 (18:26 IST)
వైసిపిలో ఫైర్ బ్రాండ్ రోజా. ప్రతిపక్ష పార్టీ నేతలను ఏకిపారేయడంలో ఆమెకు ఆమే సాటి. విమర్సలంటే రోజా చేస్తేనే అన్నవిధంగా పదునైన మాటలతో ఫైర్ బ్రాండ్గా మారిపోయారు రోజా. అలాంటి రోజాకు మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని అందరూ భావించారు.
తనకు మంత్రి పదవి గ్యారంటీ అని రోజా అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి దక్కకుండా పోయింది. రోజా అలిగారని సిఎం ఇక ఎపిఐఐసి ఛైర్ పర్సన్ పదవి ఇచ్చారు. రెండవసారి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ప్రారంభం జరుగుతోంది.
ఈసారి రోజాకు మంత్రి పదవి పక్కా అన్నవారు లేకపోలేదు. ఆమె అభిమానులే బహిరంగంగా ఈ విషయాన్ని చెబుతూ వచ్చారు. కానీ మళ్ళీ మంత్రి పదవి చేజారిపోయినట్లే. అయితే రోజా సినీరంగం నుంచి వచ్చిన నేపథ్యంలో సినీరంగానికి సంబంధించి ప్రభుత్వం తరపున ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆలోచనలో ఉన్నారట.
దీంతో ఆమెకు ఆ ఛైర్మన్ పదవిని అప్పగించాలని నిర్ణయానికి వచ్చారట. అంతేకాదు రోజా కింద ఒక ఐఎఎస్ అధికారి కూడా కమిటీలో పనిచేస్తారు. గతంలో ఏ ప్రభుత్వం సినీరంగం కోసం కమిటీని ఏర్పాటు చేయలేదు. కానీ ఈ కమిటీతో రోజా అలక తీర్చినట్లవుతుందని జగన్ ఆలోచిస్తున్నారట. మరి రోజా ఇందుకు ఒప్పుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది.