చలించి... కన్నీరుకార్చిన 'బాషా'.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు సాయం..
తూత్తుకుడిలోని వివాదాస్పద స్టెరిలైట్ రాగి పరిశ్రమకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
తూత్తుకుడిలోని వివాదాస్పద స్టెరిలైట్ రాగి పరిశ్రమకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కాల్పుల అంశంతో పాటు స్టెరిలైట్ ఫ్యాక్టరీ అంశం ఇపుడు తమిళనాడు రాజకీయాలను కుదిపిస్తోంది. ఒక్క అధికార అన్నాడీఎంకే మినహా మిగిలిన అన్ని విపక్ష పార్టీలు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో మృతుల కుటుంబ సభ్యులతో పాటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పోటీపడీ పరామర్శిస్తున్నారు. ఈకోవలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చేరిపోయారు.
మృతుల కుటుంబాలను చూడగానే ఆయన చలించిపోయి.. కన్నీరు కార్చారు. ఆ తర్వాత తేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చి.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రకటించారు. అంతేకాకుండా, తాను వ్యక్తిగతంగా ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే, క్షతగాత్రులకు కూడా చేతనైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత ఆయన స్పందిస్తూ, ఈ ఘటనపై లోతుగా కామెంట్ చేయదలచుకులేదన్నారు. అయితే, ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనీ గుర్తుచేశారు. పోలీసుల కాల్పులు అతిపెద్ద తప్పుగా రజనీ అభివర్ణించారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం పోతుందన్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే.. సహనం కోల్పోయి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటం ముమ్మాటికీ తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. పైగా, భవిష్యత్లో కూడా ఇవాంటి ఘటనలు పునరావృతంకాకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.