Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
ప్రతిరోజు వాడే ఆభరణాలు కానీ, బీరువాలో ఉండే వెండి, డైమండ్, ముత్యాలు, పగడాలు, బంగారం ఆభరణాలు కానీ మెరుపు తగ్గుతాయి. మధ్యమధ్యలో వాటిని శుభ్రపరచడం వల్ల ధగధగలాడుతూ కొత్త వాటిలా మెరుస్తూ ఉంటుంది.
బంగారు ఆభరణాలను వేసుకుని తీసివేసిన తరువాత మెత్తటి కాటన్ క్లాత్లో కొంచెం పొడి పసుపు వేసి బాగా తుడిచి బీరువాలో పెట్టాలి. నీటిలో పటిక, చింతపండు రసం, కుంకుడుకాయ రసం కలిపి బంగారు వస్తువులను కడిగితే బాగా మెరుస్తాయి. నీళ్ళలో పసుపు, కొంచెం డిటర్జంట్ పౌడర్ వేసి మరిగించి ఆభరణాలను దాంట్లో వేసి ఒక గంట ఉంచి టూత్ బ్రష్తో రుద్దాలి. ఆ తరువాత చల్లటి మంచి నీటిలో కడిగితే ఆభరణాలు కొత్తవాటిలా తళతళలాడుతూ ఉంటాయి.
కుంకుడు రసంలో కొంచెం వెనిగర్ కలిపి బంగారువస్తువులను వేసి ఒక గంటసేపు ఉంచి ఆ తరువాత పాత టూత్ బ్రష్తో రుద్దితే ధగధగ మెరుస్తాయి. బంగారు నగలు అన్నింటినీ ఒకే బాక్స్లో వేస్తే అవి తీసేటప్పుడు చిక్కుపడతాయి. అటువంటప్పుడు వాటిపై కొంచెం టాల్కం పౌడర్ వేస్తే చిక్కుముడులు త్వరగా విడిపడతాయి.
అలాగే ముత్యాలు, పగడాలు మొదలైన పూసల నగలు వాడిన తరువాత వాటిపై కొంచెం బియ్యపు పిండి వేసి రుద్దాలి. ఆ తరువాత నీళ్ళలో శుభ్రంగా కడిగితే మెరుస్తూ ఉంటాయి. ఆర్టిఫీషియల్ ముత్యాల ఆభరణాలను కాటన్, ఊలు క్లాత్లో వేసి భద్రపరిస్తే మెరుపు పోకుండా ఉంటాయి.
వజ్రాల ఆభరణాలను కొంచెం టూత్ పేస్ట్ వేసి బ్రష్తో రుద్దితే బాగా మెరుస్తాయి. ఒక లీటర్ నీటిలో టీ స్పూన్ ఉప్పు, సోడా వేసి దాంట్లో వెండి ఆభరణాలను వేసి అయిదునిమిషాలు మరిగించాలి. ఆ తరువాత సబ్బు నీటిలో వేసి బ్రష్తో రుద్ది కడిగి మెత్తటి బట్టతో తుడిస్తే కొత్త వాటిలా మెరుస్తాయి.