Publish Date: Tue, 02 Jun 2020 (20:28 IST)
Updated Date: Tue, 02 Jun 2020 (20:29 IST)
ఉన్నత విద్యామండలి రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ను రూపొందించింది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా కళాశాలలకు సెలవులను పెంచిన సంగతి విదితమే. అయితే డిగ్రీ, పీజీ చదువుతున్న రెండవ మరియు మూడవ సంవత్సర విద్యార్థులకు ఆగస్ట్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
కాగా మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం సెప్టెంబర్ నెలలో తరగతులను నిర్వహిస్తారు. కొవిడ్-19 కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆలస్యం కారణంగా తరగతుల సమయాన్ని రోజుకు ఒక గంట నుంచి రెండు గంటల వరకు పెంచనున్నారు.
పండగలకు ఇచ్చే సెలవులకు సైతం కోత పెట్టనున్నారు. ప్రతి శనివారం కూడా సెలవులు లేకుండా తరగతులు నిర్వహించనున్నారు. ఆగస్ట్ నుండి మే వరకు అన్ని కళాశాలలు, యూనివర్సిటీలు పని చేసేలా అకడమిక్ క్యాలెండర్ను రూపొందించారు. రానున్న విద్యా సంవత్సరం, అనగా 2020-21 అకడమిక్ ఇయర్ను యథావిధిగా ఉండేలా ప్రణాళికలు రచించారు.
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులకు జూలైలో పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే మిగతా సంవత్సరాలలోని విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభం అయ్యాక పరీక్షలు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. ఆగస్ట్లో ఇంజనీరింగ్ సీట్ల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. వీటిని పూర్తి చేసిన తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలను నిర్వహిస్తారని సమాచారం.