Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
ఆమ్లేట్ వేయలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని కేపీహెచ్బీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే.. రేవడ మహేష్ (24) వనజ దంపతులు.. స్థానికంగా రోడ్డు నెంబర్-1లో నివసిస్తున్నారు. వాచ్మన్గా పనిచేస్తున్న మహేష్ మంగళవారం రాత్రి పూటుగా మందుకొట్టి ఇంటికొచ్చాడు.
తాగిన మత్తులో ఉన్న మహేష్ తనకు ఆమ్లేట్ వేసివ్వాలని భార్యను కోరాడు. అందుకామె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కాసేపటికి తర్వాత ఇంటి యజమాని వద్దకు వెళ్లిన వనజ భర్తతో జరిగిన గొడవ గురించి చెప్తుండగానే.. మహేష్ ఇంట్లోని గదికి వెళ్లి తలుపులేసుకున్నాడు. చాలాసేపటి వరకు తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తలుపు బద్దలు కొట్టి చూడగా లోపల మహేశ్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.