Publish Date: Mon, 10 Oct 2022 (20:22 IST)
Updated Date: Mon, 10 Oct 2022 (20:25 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై క్రీడలు, టూరిజం శాఖ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ది కుంభకర్ణుడి నిద్ర అని అభివర్ణించారు. అమరావతిని అభివృద్ధిని చేస్తే రాష్ట్రమంతా అభివృద్ధి చెందదన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలని, అనవసర రాద్ధాంతం మాని ఇప్పటికైనా 26 జిల్లాల అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.
టీడీపీ, బీజేపీతో జత కట్టినప్పుడు ఉత్తరాంధ్రలో వలసలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. రోజుకో మాట, పూటకో వేషం వేసుకుంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం రోజా మాట్లాడుతూ, మూడు రాజధానులతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చేయడం వల్ల ఎంత ఇబ్బందిపడ్డామో, భవిష్యత్ తరాల వారు అలాంటి ఇబ్బందిపడకూడదనే మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని వివరించారు.
జగన్ మోహన్ రెడ్డి ఒక తండ్రి మనసుతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే, టీడీపీ వాళ్లు నానా యాగీ చేస్తున్నారని రోజా విమర్శించారు.