Publish Date: Thu, 03 Oct 2019 (09:32 IST)
Updated Date: Thu, 03 Oct 2019 (09:16 IST)
నిత్యం లింగంపల్లి నుంచి గుంటూరు మీదుగా తిరుపతికి వెళ్లే నెంబరు. 12734 నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే మార్పు చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి మార్చిన సమయపట్టిక అమలులోకి వస్తుందని సీపీఆర్వో రాకేష్ తెలిపారు.
మారిన టైం టేబుల్ ప్రకారం ఈ రైలు లింగంపల్లిలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి 5.50కి బేగంపేట, 6.15కి సికింద్రాబాద్, 6.49కి బీబినగర్, రాత్రి 7.30కి రామన్నపేట, 7.40కి చిట్యాల, 8 గంటలకు నల్లగొండ, 8.24కి మిర్యాలగూడ, 8.39కి విష్ణుపురం, 8.57కి నడికుడి, 9.18కి పిడుగురాళ్ల, 9.47కి సత్తె నపల్లి, 11 గంటలకు గుంటూరు, 11.54కి తెనాలి, మరుసటిరోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి చేరుకొంటుంది.
దసరా సెలవులకు జనసాధారణ రైళ్లు..
దసరా సెలవులకు హైదరాబాద్ నుంచి గుంటూరుకు వచ్చేవారు, ఇక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లేవారి సౌకర్యార్థం జనసాధారణ రైళ్లని నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ రైళ్లు నిత్యం సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు సాగించనున్నాయి.
ఈ నెల 10వ తేదీ వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని గుంటూరు సీనియర్ డీసీఎం డి.నరేంద్రవర్మ తెలిపారు. రెగ్యులర్, ప్రత్యేక రైళ్లలో టిక్కెట్లు బుకింగ్ చేసుకోలేకపోయినవారు ఈ జన సాధారణ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నెంబరు.07192 సికింద్రాబాద్- విజయవాడ జనసాధారణ రైలు ఈ నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిత్యం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా మధ్యాహ్నం 3.05కి నడికుడి, 3.30కి పిడుగురాళ్ల, 4.03కి సత్తెనపల్లి, సాయంత్రం 5.20కి గుంటూరు, 5.55కి మంగళగిరి, రాత్రి ఏడుగంటలకు విజయవాడ చేరుకొంటుంది. నెంబరు.07193 విజయవాడ- హైదరాబాద్ జనసాధారణ రైలు ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు నిత్యం రాత్రి 8.15 గంటలకు బయలుదేరి 8.45కి మంగళగిరి, 9.15కి గుంటూరు, 9.52కి సత్తెనపల్లి, 10.18కి పిడుగురాళ్ల, 10.46కి నడికుడి, అర్ధరాత్రి 1.40కి సికింద్రాబాద్, వేకువజామునకు ముందు 3గంటలకు హైదరాబాద్ చేరుకొంటుంది. ఈ రైళ్లలో 14 జనరల్ బోగీ లుంటాయని సీనియర్ డీసీఎం తెలిపారు.