Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విపక్ష నేత అంటే అసెంబ్లీకి వెళ్లి నిలదీయాలని.. కానీ వైకాపా చీఫ్ జగన్ మాత్రం బుగ్గలు నిమరడం తప్ప ప్రశ్నించడాన్నే మరిచిపోయారని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు మగతనం బయటపడుతుందన్నారు.
అసెంబ్లీకి వెళ్లకుండా తనను తప్పుబట్టడాన్ని పవన్ తీవ్రంగా పరిగణించారు. తనకు ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ లేరని అయినా తానే ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. అంతమంది ఎమ్మెల్యేలను ఉంచుకుని వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానన్న జగన్.. రెల్లి కులస్థుల భూములను ఆ పార్టీ నేతే దోచుకున్నా పట్టించుకోలేదని గుర్తు చేశారు.
పనిలో పనిగా వరుసగా పంచెకట్టుతో కనిపించడానికి వెనుక గల కారణాన్ని పవన్ బయటపెట్టారు. తాను పంచెకట్టడంలో ఎటువంటి విశేషం లేదని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటడానికే పంచె కడుతున్నట్టు చెప్పారు. జనసేన ఆంధ్రులకు అండగా ఉంటుందని, వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందని పవన్ పేర్కొన్నారు.