నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్ని సృష్టించాయి. ఆయన భాష చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన సైకో గాడు, ఎవడు వంటి పదాలను ఉపయోగించారు, ఇది చాలామందికి ఆమోదయోగ్యం కాదని అనిపించింది. కొందరు ఆయన చిరంజీవిని లక్ష్యంగా చేసుకున్నారని, మరికొందరు ఆయన ఉద్దేశ్యపూర్వకంగా అలా మాట్లాడలేదని అంటున్నారు.
అయినప్పటికీ, బాలయ్య స్వరం అభ్యంతరకరంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయమై ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, తాను బాధపడ్డానని స్పష్టం చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో నటుడు చిరంజీవి పేరిట ఓ ప్రకటన విడుదలైంది.
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు బాలయ్యపై మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి పేర్ని నాని.. బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ తనకు ఫోన్ చేశారంటూ పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను చూస్తే బాలకృష్ణకు కడుపుమంటగా ఉందని పేర్ని నాని అన్నారు. సీఎం చంద్రబాబుతో సమానంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో ఉండటం చూసి బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
మరోవైపు మంత్రి పదవి కోసమే కామినేని శ్రీనివాస్ అబద్ధాలు మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానంలో తనకు మంత్రిగా అవకాశం ఇస్తారనే ఆశతోనే ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.