Publish Date: Sat, 20 Jul 2019 (18:21 IST)
Updated Date: Sat, 20 Jul 2019 (19:11 IST)
కృష్ణ మాదిగ పోరాటం వల్ల టీడీపీకే లబ్ది అని బాపట్ల ఎంపీ సురేష్ అన్నారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... "మందకృష్ణ మాదిగ పోరాటం వల్ల టీడీపీ చాలా లబ్ది చేకూరింది. మందకృష్ణలో దళితులపై ప్రేమ కనిపించడం లేదు. దళితులకు సీఎం వైయస్ జగన్ చేస్తున్నమంచిని అడ్డుకోవాలనేలా మందకృష్ణ తీరు ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు దగ్గరవుతుంటే మందకృష్ణ భయపడుతునట్లు ఉంది. రాత్రికి రాత్రి హైదరాబాద్ నుండి వచ్చి ఈ హడావిడి ఎందుకో..?
మందకృష్ణ వెనుక ఏ చంద్రుడు ఉన్నాడో దళితులకు తెలుసు. 15 రోజుల క్రితం వైయస్ జగన్ను పొగిడి ఇప్పుడు తిట్టడం వెనకున్న ఆంతర్యం ఏంటి.? దళితులకు ఎలా మంచి చెయ్యాలో సీఎం జగన్కి తెలుసు.. మందకృష్ణ చెప్పాల్సిన అవసరం లేదు. దళితులకు మేలు జరిగితే తన పబ్బం గడవదని మందకృష్ణ ఉలిక్కి పడుతున్నారు. సీఎం జగన్తో మాట్లాడేందుకు సమయం ఇస్తామన్నా రాకుండా గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ధర్నాలు, బంద్లు లాంటి ఆలోచనలు మానుకోవాలి. వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది, రాష్ట్ర పరిధిలోది కాదు. వర్గీకరణ జరిగితే దేశం మొత్తం జరగాలి. ఒక్క ఏపీలో మాత్రమే జరిగేది కాదు. దళితులకు అన్ని రకాలుగా అదుకుంటానని సీఎం వైయస్ జగన్ చెప్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఇతర పదవులు, పధకాలు ఎస్సీలకు మేలు కలిగేలా చేస్తున్నారు" అని బాపట్ల ఎంపీ సురేష్ అన్నారు.