Publish Date: Wed, 02 Oct 2019 (14:43 IST)
Updated Date: Wed, 02 Oct 2019 (14:16 IST)
బెజవాడ నుంచి గూడూరుకు ఇటీవల ప్రవేశపెట్టిన ఇంటర్ సిటీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు రైల్వే బోర్డు ‘వ్రికమసింహపురి అమరావతి’గా నామకరణం చేసింది. నేటి నుంచి ఈ రైలుకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ఈ పేరును పెడుతున్నారు.
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు మేరకు రైల్వే బోర్డు ఇటీవల విజయవాడ నుంచి గూడురుకు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టింది. ఈ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్కు అత్యాధునిక బోగీలను ఉపయోగించారు. ఇంటీరియర్తోనూ, సౌకర్యవంతంగానూ ఉండటం చేత ప్రయాణీకులు ఈ రైలును విపరీతంగా ఆదరిస్తున్నారు.
ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ ద్వారా ఈ రైలుకు 90 శాతం రిజర్వేషన్ జరుగుతోంది. దాదాపుగా నూరు శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) తో ఈ రైలు నడుస్తోంది. ఈ రైలుకు ఈ పేరు సూచిస్తూ ఎవరూ ప్రతిపాదించలేదని తెలుస్తోంది. రైల్వే బోర్డు ఈ పేరు ప్రకటించడం ఆశ్చర్యాన్ని గొలుపుతోంది.
విజయవాడ నుంచి నడుస్తున్న ఏదైనా రైలుకు ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్గా నామకరణం చేయాలన్న ప్రతిపాదన ఉన్నా, విశాఖ నుంచి కాకుండా విజయవాడ నుంచి ఢిల్లీకి నడిపే ఏపీ ఎక్స్ప్రెస్కు అమరావతిగా నామకరణం చేయాలని డిమాండ్ ఉన్నా పట్టించుకోని రైల్వే బోర్డు ఇంటర్ సిటీకి పేరు పెట్టడం విశేషం.