Publish Date: Tue, 21 Jul 2020 (21:04 IST)
Updated Date: Tue, 21 Jul 2020 (21:08 IST)
కరోనా వైరస్ చిన్నపరిశ్రమలకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. లాక్ డౌన్ సందర్భంగా ఆర్డర్లు కరువయ్యాయి. ఇప్పుడు సడలింపులు వచ్చాక కార్మికులు కరువయ్యారు. ఏం చేయాలనే పరిస్థితుల్లో పరిశ్రమల నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు. ఏ పరిశ్రమలు గేటు ముందు చూసినా కార్మికులు కావలెను అన్న బోర్డులు వేలాడు తున్నాయి.
కార్మికులు లేకుండా సంగారెడ్డి జిల్లాలో దయనీయ పరిస్థితి నెలకొన్నది. ఈ జిల్లాలో కొన్ని వేల సంఖ్యలో చిన్న చిన్నపరిశ్రమలు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ అనేక రాష్ట్రాల నుండి వలస కూలీలు వచ్చి తమ జీవితాన్ని గడుపుతుండటం వల్ల వీటిని మినీ ఇండియాగా పిలిచేవారు.
ప్రస్తుతం కరోనా ప్రభావంతో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో చిన్నచిన్న పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. కార్మికుల సమస్య చిన్న పరిశ్రమలనే కాదు పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా వెంటాడుతున్నాయి. లాక్డౌన్ కారణంగా అనేక పరిశ్రమలు నష్టపోయాయని యాజమాన్య వర్గాలు తెలుపుతున్నాయి.