Publish Date: Thu, 19 Mar 2020 (13:58 IST)
Updated Date: Thu, 19 Mar 2020 (13:58 IST)
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. 'నమస్కారం.. యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోన్న సమస్య 'కరోనా'. అయితే, మనకి ఏదో అయిపోతుందన్న భయం కానీ, ఏమీ కాదన్న నిర్లక్ష్యం కానీ పనికిరావు' అని తెలిపారు.
'జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయమిది. జన సమూహానికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ ఉద్ధృతి తగ్గేవరకు ఇంటి వద్దే ఉండడం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మోచేయి వరకు వీలైనన్నీ సార్లు సుమారు 20 క్షణాల పాటు శుభ్రంగా కడుక్కోవాలి' అని చిరు చెప్పారు.
'తుమ్మినా, దగ్గినా కర్చిఫ్ లాంటివి అడ్డు పెట్టుకోవడం లేక టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూపేపర్ కూడా చెత్త బుట్టలో వేయండి. జర్వం, జలుబు, దగ్గు, అలసట ఉంటే డాక్టరును సంప్రదించండి. కరోనా మహమ్మారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. ఎవరికీ కరచాలనం చేయకుండా మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం' అని చిరంజీవి పిలుపునిచ్చారు.