Publish Date: Wed, 18 Mar 2020 (14:48 IST)
Updated Date: Wed, 18 Mar 2020 (14:50 IST)
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని పుష్కరిణి స్నానఘట్టాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించాక పుష్కరిణిలో స్నానం ఆచరించి, ఒడ్డునే ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి దర్శనం చేసుకున్న అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లడం ఆనవాయితీ. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగం ప్రబలకుండా ఉండేందుకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రత్యామ్నాయంగా సమీపంలో 18 స్నానపు గదులు ఏర్పాటు చేశామని, భక్తులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే అధికారులు తిరుమలను తొమ్మిది విభాగాలుగా విభజించి నిత్యం రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. క్యూ కాంప్లెక్స్, అన్నదాన సత్రం, కల్యాణ కట్టలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.