Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వెళ్ళాలంటే తిరుపతిలో నుండే వెళ్ళాలి. దాంతో ప్రపంచం నలుమూలల నుండి పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి తిరుపతిలో ఉండే జనాల రద్దీ మొత్తం తిరుమల రద్దీయే. అలాంటిది గడచిన పది రోజులుగా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ జనాల తాకిడి దాదాపు లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్ధితుల్లో కూడా తిరుపతిలో మొదటి కరోనా కేసు బయటపడింది. అది ఢిల్లీలోని మత ప్రార్ధనల పుణ్యమేనని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. తిరుపతిలోని త్యాగరాజా నగర్లో నివాసం ఉంటున్న ఓ యువకుడికి కోరానా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ యువకుడు కూడా ఢిల్లీలోని జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలకు హాజరై వచ్చినట్లు సమాచారం. ఇతను ఢిల్లీకి వెళ్ళి వచ్చిన విషయం తెలియగానే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతనితో పాటు ఇతన కుటుంబ సభ్యులను కూడా అధికారులు ఐసొలేషన్ వార్డుకు తరలించారు.
ఐసొలేషన్లో ఉన్న యువకుడికి జ్వరం లక్షణాలు బయటపడటంతో వైరస్ పరీక్షలు నిర్వహించారు. దాంతో కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దాంతో గురువారమే సంబంధిత అధికారులు బాధితుడి ఇంటికి వచ్చి అతనితో పాటు కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్ సెంటర్కు తరలించారు. ఇంకా తిరుపతిలో తొలి వైరస్ కేసు బయటపడటంతో త్యాగరాజా నగర్, మంచాలవీధి, టౌన్ క్లబ్ ఏరియా, గాలి వీధి, తీర్ధకట్ట వీధి, గాంధీ నగర్ తో పాటు భవానీ నగర్ సర్కిల్ ను డేంజర్ జోన్గా అధికారులు ప్రకటించారు.