Publish Date: Fri, 02 May 2025 (15:55 IST)
Updated Date: Fri, 02 May 2025 (16:09 IST)
భారతదేశంలోని ప్రశాంత కాశ్మీర్ లోయల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పహెల్గాం ఊచకోతలో (Pahalgam Attack) 26 మంది పర్యాటకులు మృతి చెందారు. దీనితో ఆగ్రహం చెందిన భారతదేశం పలు ఆంక్షలు విధించింది. కానీ పాకిస్తాన్ పైన యుద్ధం (India Pakistan War) చేయబోతున్నామని ఇప్పటివరకూ ప్రకటించలేదు. దెబ్బ తిన్నప్పటికీ సంయమనం పాటిస్తోంది. ఐతే పాకిస్తాన్ దేశం మాత్రం కవ్వింపు చర్యలకు దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలను మోహరిస్తోంది. అపుడపుడు కాల్పులకు తెగబడుతోంది.
వీటన్నిటినీ భారతసైన్యం ఎదుర్కొంటోంది. పాక్ మంత్రి నోటిదూల వ్యాఖ్యలు చేసాడు. తాము ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా వున్న సంగతి నిజమేనంటూ నోరు జారాడు. అంతేకాదు... తమ దేశంలో పలు ప్రాంతాల్లో రహస్యం వుంచిన అణుబాంబులు (india vs pakistan nuclear weapons) భారతదేశం వైపు చూస్తున్నాయంటూ మరో నోటిదూల డైలాగ్ వదిలాడు. ఐతే వీటన్నిటికీ భారతదేశం నుంచి ఎదురు సమాధానం రాలేదు.
అదలావుంచితే... అసలు భారతదేశం ఒకే ఒక్క అణుబాంబు ప్రయోగిస్తే పాకిస్తాన్ ప్రధాన నగరం బూడిదగా మారిపోతుందంటూ నిపుణులు చెబుతున్నారు. అత్యంత శక్తివంతమైన అణుబాంబులు భారతదేశం వద్ద వున్నట్లు చెబుతున్నారు. భారతదేశం ఇప్పటివరకూ రెండు అణు ట్రయిల్స్ నిర్వహించింది. ఒకటి 1974లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాలంలో జరుపగా 1998లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయ్ కాలంలో పోఖ్రాన్ పరీక్షలు జరిపింది. దీనిపేరు స్మైలింగ్ బుద్ధ అని నామకరణం కూడా చేసారు.
ఇస్లామాబాదుపై స్మైలింగ్ బుద్ధ పేలితే ఏమవుతుంది?
పాకిస్తాన్ నగరంపైన ఇండియా స్మైలింగ్ బుద్ధ అణుబాంబును ప్రయోగిస్తే... కనీసం 80 వేల మంది ప్రాణాలు కోల్పోతారు. మరో లక్షన్నర మంది తీవ్ర గాయాలపాలవుతారు. కనీసం 3.78 కిలోమీటర్ల పరిధిలో సర్వనాశనం అవుతుంది. దాడిలో బతికిబైటపడ్డవారిలో కనీసం 15 శాతం మంది ఆ తర్వాత ప్రాణాంత కేన్సర్ వ్యాధితో నెలల కాలంలో మరణిస్తారు. మరో అణుబాంబు ఆపరేషన్ శక్తిని ఇండియా ప్రయోగిస్తే.. 1.25 లక్షల మంది తక్షణం మరణిస్తారు. కనీసం 2.25 లక్షల మంది తీవ్ర గాయాలపాలవుతారు. కనీసం 4.2 కిలోమీటర్ల పరిధిలో సర్వనాశనం అవుతుంది.
ఈ దాడి నుంచి బతికి బయటపడినప్పటికీ ఆ తర్వాత కాలంలో ప్రభావిత ప్రాంతంలోని వారు ప్రాణాంతక వ్యాధులకు గురై చనిపోతారు. ఇక రేడియేషన్ అయితే కనీసం 7 కిలోమీటర్ల పరిధి వరకూ వ్యాపిస్తుంది. ఫలితం ఇంత భయంకరంగా వుంటుంది కనుకనే ఏ దేశం కూడా అణుబాంబు దాడి గురించి మాట్లాడదు. ఒకవేళ యుద్ధం అనివార్యమై చివరి అంకానికి చేరుకున్నప్పుడు మాత్రమే అణ్వస్త్రాలను సంధించే అవకాశం వుంటుంది. ఏదేమైనప్పటికీ మానవ మనుగడ సాగించాలంటే అణు ఆయుధాలు వాడకూడదు. ఒకవేళ వాటిని వాడినట్లయితే ఇక మానవ సమాజం అంతానికి పునాది పడ్డట్లే. అందుకే అలాంటి పరిస్థితులు రాకూడదని ప్రపంచంలోని ప్రతి దేశం కోరుకుంటూ వుంటుంది. కానీ ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ దేశం వున్నట్లు కనబడుతోంది.