Publish Date: Sat, 18 Jul 2020 (14:34 IST)
Updated Date: Sat, 18 Jul 2020 (19:08 IST)
సబ్జా గింజలతో తలనొప్పి మాయమవుతుందా? అంటే అవుననే అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. సబ్జా గింజలను నీటిలో కలిపి తింటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. మైగ్రేన్తో బాధ పడుతున్న వారు కూడా ఇలా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరు వెచ్చని నీటిలో తేనె, అల్లం రసం కలిపి దాంతో పాటు కొన్ని సబ్జాగింజలను కూడా అందులో వేసి ఆ మిశ్రమం తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి.
అధిక బరువు సమస్యతో బాధ పడేవారికి సబ్జా గింజలు ఒక చక్కని ఔషధం. ఎందుకంటే వీటిని కొద్ది మోతాదులో తిన్నా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. కాబట్టి వీటిని నిమ్మరసంతో కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గించుకోవచ్చు.
సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. డైటరీ ఫైబర్ అధికంగా వున్న సబ్జా గింజలను తీసుకోవడం ద్వారా గ్యాస్, అసిడిటీ సమస్యలుండవు. కొద్దిగా సబ్జా గింజలను తీసుకుని పొడి చేసి దాన్ని గాయాలపై వేసి కట్టు కడితే అవి త్వరగా మానుతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లను కూడా దరి చేరనివ్వదు.
ఉదయాన్నే సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే తద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. చిన్నారులకు, టీనేజ్ వారికి ఇలా తినిపిస్తే వారు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. నీరసం దరిచేరదు. శారీరక శ్రమ చేసే వారు, క్రీడాకారులు ఇలా సబ్జా గింజలను తింటే దాంతో ఇంకా ఎక్కువ సేపు పనిచేయగలుగుతారని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.