Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
పసిపిల్లలకు ఏం పెట్టవచ్చు.. ఏం పెట్టకూడదు అనే విషయంలో బోలెడు సందేహాలు. పెట్టే ఆహారం సరైంది కాకపోతే చిన్నారి ఆరోగ్యానికే ఇబ్బంది. అందుకే వారికి ఏడాది నిండేవరకు ఎప్పుడు ఎలాంటి ఆహారం అందివ్వాలో తెలుసుకోవడం మంచిది.
పసిపిల్లలు తల్లిపాలు ఎంత తాగితే అంత తాగించడం మంచిది. ఒకవేళ తల్లిపాలు అందకపోతే వారికి పాల పొడులు ఉత్తమం. గేదె, ఆవుపాలలో ప్రోటీన్స్, ఫ్యాట్.. ఎక్కువగా ఉంటాయి. నిజానికి వీరికి ప్రోటీన్స్ మరీ అంత అవసరం ఉండదు. పైగా కొందరు శిశువులకు ప్రోటీన్స్ అలర్జీ ఉండొచ్చు. జీర్ణవ్యవస్థ సమస్యలు రావొచ్చు. అందువలన ఏడాది నిండాకే గేదే, ఆవుపాలు పట్టించాలి.
పసిపిల్లలకు ఆరునెలల తరువాత ఘన పదార్థాలను ఇవ్వడం మొదలుపెట్టాలి. బియ్యం జావ మొదట అలావాటు చేయాలి. అది తేలిగ్గా అరుగుతుంది. దాన్ని ఎలా తయారుచేయాలంటే.. ముందుగా బియ్యాన్ని ఓ ఆరు గంటలు నానబెట్టి.. తరువాత నీడలో ఆరబెట్టి పొడి చేయాలి. బియ్యం నానడం వలన త్వరగా ఆరుగుతుంది. ఈ పొడిలో నీళ్లు కలిపి జావగా చేయాలి.
ఉగ్గు అనేది 8 నెలల తరువాత పెట్టాలి. దీనికోసం 3 కప్పుల బియ్యానికి కప్పు పప్పు తీసుకోవాలి. వీటిని రాత్రంతా నానబెట్టి ఆ తరువాత ఆరబెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని ఉడికించి పెట్టొచ్చు. దీంతోపాటు పసిపిల్లలకు రాగులు చాలా మంచివి. వీటిని మొలకలు కట్టించి.. కాస్త వేయించి పొడి చేసి జల్లించాలి. దీన్ని జావలా చేసి అందివ్వాలి. ఇలా ఇవ్వడం వలన ఆకలి పెంచే ఎంజైము జీర్ణాశయంలో విడుదలవుతుంది.