భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టిన రోజు వేడుకలను బుధవారం జరుపుకుంటున్నారు. దీంతో ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్లతో పాటు.. కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వివిధ పార్టీల నేతలు, వివిధ దేశాధినేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. మంగళవారం ఆయనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ ఫోన్కాల్ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మిత్రుడు డోనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశంపై ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. 'భారత్ - అమెరికా సమగ్ర అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మీలాగే నేను కూడా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు మా మద్దతు ఉంటుంది' అని మోడీ ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఈ ఫోన్కాల్ జరిగిన సమయంలోనే, ఢిల్లీలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్, భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ చర్చలు సానుకూలంగా, భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జరిగాయని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్తో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ట్రంప్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 9న ఆయన మాట్లాడుతూ 'ఇరు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను' అని తెలిపారు. దీనిపై ప్రధాని మోడీ కూడా స్పందిస్తూ చర్చల ఫలితంపై విశ్వాసం వ్యక్తం చేశారు.