Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
ఒత్తిడి ఉన్నప్పుడు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తున్నారా? అయితే ఇకపై అలా చేయడం ఆపండి. ఎందుకంటే ఒత్తిడిలో వున్నప్పుడు రాత్రి పూట నిద్రను దూరం చేసుకోవడం ద్వారా పలు అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
ఇలా చేస్తే ఏకాగ్రత కోల్పోతారని చెప్తున్నారు. ఒకవేళ ఒత్తిడిలో వున్నట్లైతే.. హాయిగా పాటలు వినడం, ఇష్టమైన విషయాన్ని గుర్తు చేసుకోవడం, ఒత్తిడి కారణమైన అంశంపై పరిష్కారం కోసం వెతకడం వంటివి చేయాలి. ముఖ్యంగా హాయిగా నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. నిద్రకు ఉపక్రమించేందుకు ముందు.. మిగిలిన విషయాలతో ఎలాంటి సంబంధం లేదనే ధోరణిలో నిద్రకు ఉపక్రమించాలి.
ఇంకా తీసుకునే ఆహారం మనసుపై ప్రభావం చూపుతుందట. అందుకే చికాగ్గా, ఒత్తిడిగా అనిపించినప్పుడు చక్కెర, కెఫీన్ ఉన్న పదార్థాలను తక్కువగా తినాలి. ముఖ్యంగా శీతలపానీయాలు, చిప్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. దానికి బదులు గ్లాసు నీళ్లు తాగినా చాలు.
ఒత్తిడిని అధిగమించేందుకు స్నేహితులతో మాట్లాడుతుంటాం. ఇలాంటప్పుడు కొన్నిసార్లు వారి ప్రతికూల ఆలోచనలు మీ ఒత్తిడికి ఇంకాస్త ఆజ్యం పోయొచ్చు. ఒకవేళ మీ స్నేహితుల్లో ఎవరినుంచైనా అలాంటి సంకేతాలు కనిపిస్తోంటే వెంటనే అడ్డుకట్ట వేసేయండి. కాసేపు ధ్యానం, యోగా వంటివి చేయగలిగితే ఆ ఒత్తిడి నుంచి బయటపడతారు.
సాధారణంగా పనులతో సతమతమవుతున్నప్పుడే ఒత్తిడి ఆవహిస్తుందని అనుకుంటాం. కానీ ఒక్కోసారి సరైన పని లేనప్పుడూ ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటప్పుడు కోసం కొన్ని పనులను కల్పించుకోండి. అభిరుచులకు సమయం కేటాయించండి. అవసరమైన నైపుణ్యాలు పెంచుకోండి. సులువుగా దాన్నుంచి బయటపడతారని మానసిక వైద్యులు చెప్తున్నారు.