Publish Date: Sat, 16 Feb 2019 (12:02 IST)
Updated Date: Sat, 16 Feb 2019 (12:31 IST)
సాధువులను అంటే సత్పురుషులను రక్షించడం కోసం.. ఆ విధంగా ధర్మసంస్థాపన చేయడం కోసం నేను ప్రతి యుగంలో ఆవిర్భవిస్తాను. అని భగవానుడు తన అవతార ప్రయోజనాన్ని, స్వభావాన్ని చెప్పుకున్నాడు.
మనం చేసే కర్మలను బట్టి భగవానుడు మనల్ని అనుగ్రహిస్తాడు. నిగ్రహిస్తాడు. సాక్షీభూతుడవుతాడు. తన భక్తులపై ఇలా ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తాడు. నా నుంచి పురుషార్థములు ప్రార్థించి, పొందువారు ఉదారులు. తన నుంచి తీసుకొను వారు ఆయనకు సర్వమును ఇచ్చే వారేనట! ఆశ్రితులు కోరిన ఫలాన్నివ్వడమే మతం - జ్ఞాని ఆయిన భక్తుడు తనకు ఆత్మ వంటి వాడట.
ఉపనిషత్తుల్లో ఈ విషయం ఉన్నట్లు లేదే. అంటే, ఉపనిషత్తులలో ఉన్నా, లేకున్నా నాకు లోటు లేదు. ఇది పూర్వమైన సిద్ధాంతం అని అంటాడు. ఇది భగవంతుని ఔదార్యానికి పరాకాష్ఠ, అయితే ఆయనకు మనం ఏం ఇవ్వగలం? భగవంతుడు అవాప్త సమస్త కాముడు. ఆయనకు లేనిది లేదు. అన్నికోరికలు తీరిన వాడు. నా సంకల్పం చేతనే నేను అన్నీ సృష్టించుకుంటానంటాడు. ఆయన సౌశీల్యమే భక్తులకు శ్రీరామరక్ష. ఈ విషయమే రామనుజ గీతాభాష్యంలో ఇలా వివరించారు.
దేవతిర్యక్కుమనుష్య స్థావరాత్మకంగా ఉన్న ప్రాణుల్లో జాతిని బట్టి, ఆకారాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి హెచ్చుతగ్గులున్నా భక్తుల పట్ల, భగవానుడు ఈ తారతమ్యాలను పాటించడు. అందరూ ఆయనకు సమానులే. భక్తుల ప్రేమను, ఆర్తిని మాత్రమే చూసి, కర్మానుగుణంగా వారిని ఆదరించడమే భగవంతుని స్వభావం.