Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
సుఖంలో కూడా మూడు రకాలు వుంటాయని భగవద్గీతలో చెప్పబడింది. గీతోపదేశం ప్రకారం ఎవరైతే సాత్త్విక సుఖానికై ప్రయత్నిస్తారో వారు సమస్త దుఃఖాలను అధిగమిస్తారు.
సాత్త్విక సుఖంలో మొట్టమొదటిది తపస్సు వుంటుంది. తపస్సంటే కష్టంతోపాటు విసుగు అనిపిస్తుంది. అయితే లక్ష్య సాధనలో వుండేవారు ఎటువంటి శారీరక తపస్సుకైనా వెనుదీయరు. ఐదేళ్ల నుండి పదేళ్లపాటు రోజుకు ఐదారు గంటలు తీవ్రంగా పరిశ్రమిస్తేనే ఎవరికైనా క్రీడలలో బంగారుపతకం లభిస్తుంది.
బంగారు పతకం పొందే క్షణం అతి అల్పమైనదే అయినా ఆ ఫోటో జీవితాంతం సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కాకరకాయ నోటికి చేదుగా వుంటుంది. ఐతే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మిఠాయి తీయగా వుంటుంది కానీ ఆరోగ్యానికి చేటు చేస్తుంది. అందువల్ల సాత్త్విక భోజనం చేయాలి. సాత్త్విక సుఖాన్ని కోరుకుంటే ఫలితం అమృతమయంగా వుంటుంది. అందుకే అటువంటి అలవాట్లను అలవరచుకోవాలి.