Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
వృక్షాల్లో దేవతలు కొలువుంటారని విశ్వాసం. వీటిలో అరటి చెట్టును పూజించడం ద్వారా విశిష్ట ఫలాలు లభిస్తాయి. అరటి కాండానికి పసుపు కుంకుమలతో, పుష్పాలతో చక్కగా అలంకరించి దీపారాధన చేయడం ద్వారా సంతానం ప్రాప్తిస్తుంది. దీపారాధనకు అనంతరం పెసరపప్పు, బెల్లం, తులసీదళాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి.
మధ్యాహ్నం పూట ఐదుగురు ముత్తయిదువులకు భోజనం పెట్టి.. వారికి దక్షిణ తాంబూలాదులు, ఐదేసి అరటి పండ్లను వాయనంగా ఇవ్వాలి. ఈ పూజ చేసేవారు సాయంత్రం చంద్రుని దర్శించుకున్న తర్వాతే భోజనం చేయాలి. అరటి పూజను సీతారాములు కూడా చేశారని విశ్వాసం. ఈ పూజను చేసినవారికి సంతానం కలగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయట. ముఖ్యంగా అత్తింటి కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.
అరటి చెట్టును గురువు ప్రతీకగా భావిస్తారు. దేవ గురువు అయిన బృహస్పతికి అరటి చెట్టు సమానం అంటారు. అలాగే విష్ణువుకు కూడా అరటి చెట్టు ప్రీతికరమని.. గురువారం పూట అరటి చెట్టును పూజించే వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా జ్యోతిష్య ప్రకారం అరటిచెట్టు మాంగల్య దోషాలను నివృత్తి చేస్తుంది. తద్వారా సంవత్సరాల పాటు సంతానం కలగని దంపతులకు.. అరటి పూజ ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.