Publish Date: Wed, 24 Apr 2019 (17:22 IST)
Updated Date: Wed, 24 Apr 2019 (17:25 IST)
మన దేశంలో సుబ్రహ్మణ్య ఆలయాలు చాలా దర్శనమిస్తాయి. వాటిలో స్థల పురాణం ఉన్నవి పెక్కుగా ఉన్నాయి. ఇలా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో పరలస్సరి సుబ్రహ్మణ్య ఆలయం ఒకటి. ఇది చాలా పురాతనమైనది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరు చాలా అందంగా ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి.
అయితే అంతకు మునుపే ఇక్కడ అయ్యప్ప ఆలయం ఉంది. ఇప్పుడు రెండు ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం విశేషం. ఈ ఆలయాలతో పాటు అక్కడ గణపతి, నాగ, భగవతి ఆలయాల సమూహం ఉంది. ఈ ఆలయం కేరళలోని కన్నూర్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో పరాలస్సరి నగరంలో ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్న కోనేరుకు చాలా ప్రత్యేకత ఉంది.
దీనికి లెక్కపెట్టలేనన్ని మెట్లు ఉన్నాయి. దీని నిర్మాణ శైలి కేరళలో చాలా అరుదుగా కనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి శైలి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. ఈ గుడిలో మురుగన్ లేదా సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు. ఈ ఆలయంలో కనబడే రాగి మరియు కాంస్యంతో తయారు చేసిన నాగ విగ్రహాలు ప్రధాన విశేషం. కేరళలో మలయాళ ధనుర్మాస సమయంలో ఇక్కడ పండుగ వాతావరణం నిండుకుంటుంది.
ధనుర్మాసంలో 6 రోజులు జరుపుకుంటారు. ధనుర్మాసం 4వ రోజు నుండి ప్రారంభమై 11తేదీన ముగుస్తుంది. కేరళలోని అత్యంత ప్రసిద్ది చెందిన నాగదేవతలున్న ఆలయాల్లో ఇది ఒకటి. సుబ్రహ్మణ్యస్వామి రూపంలో నాగుపాము ఇక్కడకి వస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ నాగ విగ్రాహాలకి గుడ్లను నైవేద్యంగా పెట్టే సంప్రదాయం ఉంది. దీనిని ముట్ట ఒప్పికల్ అని అంటారు.
వీటితో పాటు సర్పదోష నివారణకు బలి, ఆరాధన, సర్పం ఆరాధనలు వంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. రామ, లక్ష్మణ మరియు హనుమంతుడు సీతాదేవిని వెతికే క్రమంలో ఇక్కడికి వచ్చి బసచేసారని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ సుబ్రహ్మణ్య విగ్రహాన్ని శ్రీరాముడు ప్రతిష్టించాడని చెబుతారు. విగ్రహాన్ని ప్రతిష్టించడానికి శ్రీరాముడు హనుమంతున్ని ఆదేశించాడు.
హనుమంతుడు విగ్రహం తేవడం ఆలస్యం అవుతుండటంతో రాముడు తన వేళ్లనే విగ్రహంగా భావించి ప్రతిష్టించాడు. అది గమనించిన హనుమంతుడు వేళ్లను పెకలించడానికి ప్రయత్నించాడు. అయితే ఒక వేలు కదిలినట్లు అనిపించినా మొదలు నుండి నాగుపాము పైకి వచ్చినట్లు అనిపించడంతో విడిచిపెట్టాడు.