Publish Date: Tue, 27 Nov 2018 (22:12 IST)
Updated Date: Tue, 27 Nov 2018 (22:13 IST)
ఎన్నో జన్మల పుణ్యం వలన మానవజన్మ వస్తుంది. ఈ మానవజీవితం సార్ధకం కావాలి అంటే గురువును గురించి తెలుసుకోవాలి. గురువే తల్లి, తండ్రి, దైవం. గురువును మించిన దైవం లేదు. గురువు వాక్కే వేదవాక్కు. గురువు వాక్కును శిరసావహించిన వారిని చూసి శివకేశవులు కూడా ఎంతో సంతోషిస్తారు.
బాలకాండలో గురువు ఆజ్ఞను గురించి ఇలా చెప్పబడింది. యాగసంరక్షణార్ధం రామలక్ష్మణులు అడవిలో విశ్వామిత్ర మహామునిని అనుసరించి వెడుతున్న సమయంలో విశ్వామిత్ర మునికి తమకెదురుగా ఒక స్త్రీ రావడం కనపడింది. విశ్వామిత్రులవారు రామునితో ఆమెను ఒక్క బాణంతో చంపమని ఆజ్ఞాపించారు.
తమకు అపకారం చేయని ఒక స్త్రీని చంపడం పాపమని రాముడు మెుదట సందేహించాడు. ఒక్క క్షణమాగి, తరువాత గురువు ఆజ్ఞను పాలించడమే ముఖ్య కర్తవ్యమని తలంచి బాణానెక్కుపెట్టి ఒక్క బాణంతో ఆ స్త్రీని వధించినాడు. తరువాత ఆ స్త్రీ తాటకి అనే రాక్షసి అని తెలుసుకున్నాడు. శ్రీరాముడు మరేమీ ప్రశ్నించకుండా తన గురువు యెుక్క ఆజ్ఞను పాలించాడు.