Publish Date: Sun, 14 Apr 2019 (11:52 IST)
Updated Date: Sun, 14 Apr 2019 (11:53 IST)
క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి తన అర్ధాంగిగా చేసుకోగా, పగలు జరిగే వీరి కల్యాణ మహోత్సవాన్ని తాను చూడలేకపోతున్నానని లక్ష్మీదేవికి సోదరుడిగా అదే పాల సముద్రంలో జన్మించిన చంద్రుడు విన్నవించుకున్నాడట. అందుకే ఒక్క ఒంటిమిట్టలో మాత్రం వెన్నెల వెలుగుల్లో కల్యాణం జరిగేలా నారాయణుడు చంద్రునికి వరమిచ్చాడట. అందుకే ఇక్కడ రాత్రిపూట మాత్రమే స్వామివారి కల్యాణం జరుగుతుంది.
అలాగే ఈ ఆలయంలో రామభక్తుడైన శ్రీ ఆంజనేయుడు మాత్రం కనిపించడట. దేశంలో హనుమంతుడి విగ్రహం కనిపించని ఏకైక రామాలయం ఒంటిమిట్ట ఆలయమే. ఇందుకు కారణం ఏమిటంటే.. రాముడు, ఆంజనేయుడు కలవడానికి ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల విగ్రహం ప్రతిష్ఠించారట.
రామ లక్ష్మణులను తన యాగ రక్షణకు తీసుకెళ్లిన విశ్వామిత్రుడు, ఆపై వారిని మిథిలకు తీసుకెళ్లి, శివధనుస్సును విరిచేలా చూసి, సీతారామ కల్యాణం జరిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే.. శ్రీరామ బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట కోదండ రామాలయం ముస్తాబైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం 18న జరుగనుంది.