Publish Date: Sat, 06 Jun 2020 (17:15 IST)
Updated Date: Sat, 06 Jun 2020 (17:17 IST)
కలియుగ వైకుంఠుడు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యద్భుతంగా జ్యేష్టాభిషేక మహోత్సవం జరిగింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ ఘట్టం ముగిసింది. ఏటా జ్యేష్టాభిషేకాన్ని ఆనవాయితీగా టిటిడి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది.
ముందుగా ఆలయంలో సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కళ్యాణమండపంలో స్వామి, అమ్మవార్లకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. రుత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ట ఆవాహన, నవకలశ ప్రతిష్ట ఆవాహన, కంకణ ప్రతిష్ట అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, అచమనీయం చేసి కంకణధారణ చేశారు.
ఆ తరువాత శ్రీదేవిభూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేదపండితులు శ్రీ సూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం నిర్వహించారు.