Publish Date: Wed, 27 Oct 2021 (23:05 IST)
Updated Date: Wed, 27 Oct 2021 (23:08 IST)
ఎంతో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. మరీ ముఖ్యంగా ఇక్కడ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.
బీజేపీ తరపున అభ్యర్థి ఈటల రాజేందర్ , టీఆర్ఎస్ తరపున మంత్రి హరీశ్ రావు ప్రచారంలో దూసుకుపోయారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పైనే బీజేపీ ఆశలు పెట్టుకోగా.. టీఆర్ఎస్ తరపున అన్నీ తానై ప్రచారం బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావుపైనే టీఆర్ఎస్ ఎక్కువగా ఆధారపడుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.
మరోవైపు ప్రచారానికి గడువు ముగిసిన తరుణంలో ప్రలోభాలకు తెర లేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలే డబ్బులు పంచుతున్నాయని టీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.
అలాగే అధికార పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్ఎస్ భారీగా డబ్బు పంచుతోందని ఆరోపిస్తున్న బీజేపీ.. ఆ పార్టీ ఎంత డబ్బు ఇచ్చిన తీసుకుని తమకు ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిస్తోంది.