Publish Date: Fri, 28 May 2021 (16:06 IST)
Updated Date: Fri, 28 May 2021 (16:26 IST)
సాధారణ రోజుల్లోనే మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు, పెచ్చరిల్లిపోతున్నాయి. దీనికి తోడు లాక్డౌన్ కూడా కావడంతో.. మహిళలపై గృహహింస కేసులు పెరుగుతున్నాయని హైదరాబాద్ అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లల్లో ఉండటంతో మహిళలపై పనిభారం పెరుగుతోంది.
బయటకెళ్లే పరిస్థితి లేక.. పనిలేక.. మగవారు ఒత్తిడికి గురికావటం.. అదంతా ఇంట్లో ఆడవాళ్ల మీద చూపించటం.. పిల్లలు కూడా స్కూల్స్, కాలేజీలు లేక ఇంట్లోనే ఉండటంతో పనిభారం పెరుగుతోంది. ఇంటిపని, కుటుంబ సభ్యులకు తగినట్లు నడుచుకుంటూ ఉద్యోగినులు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్తో సతమతమవుతున్నారని తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్లో కేవలం 13 రోజుల్లోనే గృహహింసకు గురైన బాధితులు తమకు ఫోన్ చేస్తున్నారని.. డయల్ 100కు ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. గృహహింసకు గురవుతున్నావారు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీ స్వాతి లక్రాసూచించారు.
ఈ లాక్ డౌన్ సమయంలో కూడా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని..లాక్ డౌన్ అమలులో ఉంది కాబట్టి మహిళలు బయటకు రాకుండా వెంటనే 100కు ఫోన్ చేయవచ్చునని.. లేదా షీ టీమ్స్ కూడా తెలియజేయవచ్చునని స్వాతి లక్రా తెలిపారు.