Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
తల్లి కౌలు డబ్బులు ఇవ్వలేదని మద్యం మత్తులో కొడుకు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ గ్రామంలోని వడ్డెర కాలనీలో నివసిస్తున్న లసుంబాయికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. చాలా కాలం క్రితం భర్త చనిపోవడంతో తనకున్న ఐదు ఎకరాల భూమిని కౌలుకిచ్చి ఆ డబ్బుతో జీవనం సాగిస్తోంది.
ఆమె సంపాదించిన డబ్బుపై పెద్ద కొడుకు నాందేవ్ కన్ను పడింది. ఆ డబ్బు కోసం తల్లితో ఎన్నోసార్లు గొడవపడ్డాడు. ఇటీవల కౌలు డబ్బు రావడంతో ఒంటరిగా ఉన్న తల్లి దగ్గరకు వెళ్లి డబ్బు ఇవ్వమని గొడవ చేసాడు. ఆమె ససేమిరా అనడంతో మద్యం మత్తులో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెకు శరీరం కాలి అరవడంతో కోడలు, కూతురు, స్థానికులు వచ్చి మంటలు ఆర్పారు.
తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కొడుకు నాందేవ్, పెట్రోల్ అందించిన అతని భార్య దీపికపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.